వైజాగ్ ఆర్.కె.బీచ్ దగ్గర వాణీ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న వాసుదేవ్ వాళ్ళ అమ్మా,నాన్నల గారాబంతో అల్లారుముద్దుగా పెరిగాడు వాళ్ళింట్లో తనే చిన్నవాడు కావడంతో.
చిన్నప్పుడు పళ్ళు తినకుండా ప్రతి రోజూ మారాం చేసేవాడు వాసుదేవ్.ఎంతో కష్టపడి ఒక పండు తినిపించేసరికి వాళ్ళమ్మకి నీరసం వస్తుండేది.అందుకే వాసుదేవ్ ని ముద్దుగా వాళ్ళమ్మ “పండు” అని పిల్చుకుంటుంది ప్రేమతో.
వాసుదేవ్ వాళ్ళ అన్నయ్య సహదేవ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసి జావా నేర్చుకుని ఒక సాఫ్టువేర్ కంపెనీలో చేరిపోయాడు.సంవత్సరం తిరిగాక ఒకరోజు L-1 వీసా రావడంతో ఉప్పొంగిపోయి,కంపెనీ వాళ్ళే ఖర్చులు భరించి పంపగా క్యాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాడు.తను ముద్దుగా పిలుచుకునే డబ్బా రేకుల సుబ్బమ్మ (డరేసు) అనబడే ఒక డెల్ ల్యాప్ టాప్ ద్వారా ప్రతి రోజూ గంట సేపు వీడియో చాట్ లోనూ,నాలుగేళ్లకో సారి నెల రోజుల పాటు డైరెక్టుగా ఫేస్ టూ ఫేస్ గానూ వాసుదేవ్ తో టైమ్ స్పెండ్ చెయ్యడం సహదేవ్ కి చాలా ఇష్టం.
అఫ్ కోర్స్,పండు కి కూడా సహదేవ్ అంటే చాలా ఇష్టం.
ఈ మధ్య పండు వాళ్ళ అమ్మా,నాన్నా సహదేవ్ కి పెళ్ళి చెయ్యాలని సంకల్పించి ఆ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నారు.అన్ని మ్యాట్రిమొనీ సైట్లలోనూ,వివాహ పరిచయ వేదికల మీదా ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ తమకు తోచిన అన్ని మార్గాల్లోనూ శోధించి,సాధించి నాలుగేళ్ళకోసారి
ఇండియాకి వచ్చే సహదేవ్ కోసం 40 మంది అమ్మాయిల మ్యాట్రిమొనీ ప్రొఫైల్స్ ఫోటోలతో సహా ఐ.ఐ.టి ఆన్సర్ షీట్లకి మల్లే కట్టలు కట్టి బీరువా లోపలి అరలో ఎంతో భద్రంగా దాచి ఉంచారు.
సాధారణంగా ఇండియాకొచ్చిన తరువాత సహదేవ్ తన ముద్దుల తమ్ముడు పండు ని వెకేషన్ ట్రిప్ కోసం ఎన్నడూ కనీ వినీ ఎరుగని చిత్ర విచిత్రమైన ప్రాంతాలకి తీసుకెళ్తుంటాడు.ఓ వారం రోజుల పాటు తమ్ముడితో టైమ్ స్పెండ్ చేసినట్టూ ఉంటుంది,ఇండియాలో కొత్త ప్రదేశాలు చూసినట్టూ ఉంటుంది అనే ఆశతో.
అలాగే ఈ సారి “కొచ్చి” దగ్గర్లోని వెల్లంగల్లూర్ వెళ్ళాలని నిశ్చయించుకున్నారు సహదేవ్,వాసుదేవ్.
ఇండియా రాగానే సహదేవ్ అమ్మా,నాన్నలు ఎంత వారిస్తున్నా వినకుండా తన వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసేసాడు ఐనా నేనింకా జస్ట్ 28 యే కదా,నాకిప్పుడప్పుడే పెళ్ళి మీద ఇంట్రస్ట్ లేదంటూ.అనుకున్నదే తడవు బ్యాగ్ సర్దేసి పండు ని తీసుకుని “కొచ్చి” కి ప్రయాణమయ్యాడు.
ఇలా లాభం లేదని నిశ్చయించిన అమ్మా,నాన్నా తాము సెలక్ట్ చేసిన 40 మంది అమ్మాయిల్లోనించి చాకు లాంటి వీణాపాణి అనే అమ్మాయికి సహదేవ్ ఆర్కుట్ మరియు ఫేస్ బుక్ ఐడి ఇచ్చి డైరెక్టుగా మాట్లాడమన్నారు.
వీణాపాణి ఒక మంచి ముహూర్తం చూసుకుని వినాయకుడికి దండం పెట్టుకుని సహదేవ్ ఆర్కుట్ ప్రొఫైల్లో తనదైన స్టైల్లో హాయ్ చెబుతూ ఒక స్క్రాప్ రాసేసింది.
“కొచ్చి” వెళ్ళగానే అమ్మా,నాన్నలకి హాయ్ చెబుదామని ఆర్కుట్ ఓపెన్ చేసిన సహదేవ్ కి వీణాపాణి మెసేజ్ పిచ్చ పిచ్చగా నచ్చేసి ఆన్-లైన్లో పడ్డాడు.
వీణాపాణి ఎలాగైనా సరే రెండు రోజుల్లో కన్యాకుమారిలో తనని కలవమని ఇన్వైట్ చేసింది.
పండుకి డైరెక్టుగా విషయం చెబుతే తనని ఆట పట్టిస్తాడనే ఉద్దేశ్యంతో ఆఫీస్ నించి అర్జంటుగా ఫోన్ కాల్ వచ్చిందని,కన్యాకుమారిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని అందమైన అబద్ధం చెప్పి మధ్యలోనే పండుకి హ్యాండిచ్చి కన్యాకుమారిలో తేలాడు సహదేవ్.
దారి మధ్యలో ఒంటరివాడైపోయాడు పండు.
అయినా సరే సహదేవ్ మధ్యలోనే వదిలేసిన వెకేషన్ ట్రిప్పుని తనెలాగైనా పూర్తి చెయ్యాలనే మహోన్నతమైన ఆశయంతో కొచ్చి నించి 37 కిలోమీటర్ల దూరంలోని వెల్లంగల్లూర్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు పండు.
వెల్లంగల్లూర్ జస్ట్ 37 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో కొచ్చి కి దగ్గర్లో ఉన్న హిల్ స్టేషన్లన్నీ ముందు చుట్టేసాడు.
కేరళ లో దాదాపు తను చూసిన అన్ని హిల్ స్టేషన్ల దగ్గరా దొరికే అద్భుతమైన,లుక్కులకి ఆగ్రా పేఠే లాగా కనువిందు చేస్తూ తియ్యటి రుచితో నోరూరించే జిలాటిన్ మరియు సిట్రస్ ఎక్స్ ట్రాక్ట్స్ తో తయారైన ఒక రకమైన నిమ్మబిళ్ళ పండుని ఎంతగానో ఆకట్టుకుంది.క్షణమైనా దాన్ని వదిలి ఉండటం
పండుకి నచ్చడం లేదిప్పుడు.అందుకే సంవత్సరం పాటు సరిపడా నిమ్మబిళ్ళల్ని రెండు అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్లో నింపుకుని తను బస చేసిన రిసార్ట్ రూముకి తీసుకొచ్చాడు పండు.
రెండు బరువైన అమెరికన్ టూరిస్టర్ బ్యాగులతో రిసార్ట్ లో దిగుతున్న పండు మీద ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల కన్ను పడనే పడింది.హాట్ ఎయిర్ బెలూన్లా నిండుగా ఉన్న ఆ బ్యాగుల్లో ఎన్ని కోట్ల రూపాయలు దాగున్నాయో అని ఆనందంతో వాళ్ళ కళ్ళు మిల మిలా మెరిసాయి.
ఆ రాత్రి ఎలాగైనా సరే ఆ అమెరికన్ టూరిస్టర్ బ్యాగుల్ని సొంతం చేసుకోవాలని ప్రణాళిక తయారు చేసుకున్నారు వాళ్ళిద్దరూ.
మిగతా కథ తరువాయి భాగంలో…